మోదీ, పుతిన్‌ల స్నేహం భారత్, రష్యాల సంబంధాలను కొత్త దారి పట్టించనుందా ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సమావేశం కీలకం కానుంది.

పుతిన్ చాలా అరుదుగా ప్రయాణాలు చేస్తారు. కాబట్టి, ఆయన భారత పర్యటన లాంఛనప్రాయం కాదని తెలుస్తోంది. 2021లో పుతిన్ ఒకే ఒక్కసారి రష్యా బయట అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసేందుకు ఆయన జెనీవా వెళ్లారు. ఈ నేపథ్యంలో, రష్యా ఎందుకు భారతదేశానికి ఇంత ప్రాముఖ్యమిస్తోంది?

భారత్, రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా స్థిరమైన, స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. పుతిన్, మోదీ చివరిసారిగా 2018 అక్టోబర్‌లో భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో పలు అంశాలపై మోదీ అభిప్రాయం తెలుసుకోవడానికే పుతిన్ భారత పర్యటనకు వస్తుండవచ్చని భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధానంగా వచ్చిన మార్పు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌ల ప్రభుత్వం ఏర్పడడం. తాలిబాన్లు “యోగ్యమైన” పాలకులేనని రష్యా అంగీకరించింది. అయితే, ఈ మార్పు ప్రాంతీయంగా పాకిస్తాన్ స్థానాన్ని బలోపేతం చేసింది.

దాంతో, భారతదేశం మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అంశంలో భారతదేశానికి భరోసా అందిస్తామని ఇటీవలే రష్యా పునరుద్ఘాటించింది. మరోవైపు, క్వాడ్ పునరుద్ధరణతో భారత్, అమెరికా వైపు మొగ్గు చూపుతుండడం రష్యాను కలవరపెట్టే అంశం.

క్వాడ్ సభ్య దేశాలైన అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇటీవలే సమవేశమై కోవిడ్ సహకారం, దక్షిణ సముద్రంలో చైనా ఆధిపత్యం తగ్గించడం మొదలైన అంశాలపై చర్చించాయి. క్వాడ్‌ను “ఆసియన్ నాటో”గా రష్యా అభివర్ణించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) యూరోప్‌లో రష్యాకు ప్రధాన శత్రువు. అమెరికా, చైనా గొడవలో భారత్, రష్యాలు చెరోవైపు నిలిచే అవకాశం ఉంది.

రష్యాకు చైనాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. సైద్ధాంతిక చరిత్ర, అమెరికాపై అపనమ్మకం సహా పలు అంశాల్లో ఆ రెండు దేశాలకూ పొత్తు కుదురుతుంది. అయితే, చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు అమెరికా ఎదురునిలవడమనేది భారత్‌కు మేలు చేసే అంశం.

Related Articles

Latest Articles